తెలంగాణపై తెలుగుదేశం వేస్తున్న పిల్లిమొగ్గల పరంపరలో కోర్ కమిటీ నియామకంతో మరో ప్రహసనం మొదలయింది. 2004 సార్వత్రిక ఎన్ని కలలో సమైక్యాంధ్ర నినాదమే తన ప్రధాన అజెండాగా ప్రకటించి, చావు దెబ్బ తిన్న తరువాత తెలుగుదేశం పార్టీ మాట మార్చింది. సరైన సమయంలో సరి యైన నిర్ణయం తీసుకుంటామని కొత్త పల్లవి అందుకున్నది. అదిప్పుడు ఒక అరిగి పోయిన రికార్డు. ఇంతలో ఉప ఎన్నికలు వచ్చాయి. మాట మళ్లీ మార్చి, ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని నమ్మ బలికింది.
ఎన్నికలలో పాల్గొన్న చాలామంది సీనియర్ నేతలు ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉన్నామని పదే పదే వక్కాణించి నారు. దీనితో కొందరు తెలంగాణ ఓటర్లు ప్రభావితమై, తెలుగు దేశం పార్టీని నమ్మి, ఆ పార్టీ అభ్యర్థులు కొందరిని గెలిపించినారు. ఉప ఎన్నికల దుమారం సద్దుమణగ క ముందే తెలుగుదేశం తిరిగి మాట మార్చింది. తెలంగాణకు వ్యతిరేకం కాదు అన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర స్థాపనకు సమ్మతించడం కాదని ఆ పార్టీ అగ్ర నాయకులే భాష్యాలు చెప్తున్నారు.
ఈ వక్ర భాష్యాలను చంద్రబాబు నాయుడు ఖండించక పోగా, సమర్థిస్తున్న సంకేతాలు పంపుతున్నారు. కోర్ కమిటీ పేరుతో ఇప్పుడు మరో ప్రహసనం మొదలయింది. ముందు ఇది కేవలం తెలంగాణ అంశా న్ని పరిశీలించడానికి వేస్తున్నట్లు తెలిపినారు. ఇప్పుడు తెలంగాణతో పాటు భూమండలంపై ఉన్న అనేకానేక అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని అంటు న్నారు. కనీసం తెలంగాణకు సంబంధించిన చర్చనీయాంశాల గురించి కూడా ఏ స్పష్టత లేదు. అసలు కోర్కమిటీ సభ్యుల ఎంపికలోనే తెలంగాణ వ్యతిరేక భావన స్ఫురిస్తున్నది.
ఐదుగురిలో నలుగురు విశాలాంధ్ర వాదులు. ఈ కమిటీ తొలి సమా వేశానికి కమిటీ సభ్యుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు స్వయంగా అధ్యక్ష త వహించడం ప్రహసనంలో ఉప ప్రహసనం. ఇక ఈ కమిటీ పరిశీలించబోయే అంశాల గురించి చర్చిద్దాం. ముందుగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకుంటారట. దీనికి ఏ పద్ధతి అవలంభిస్తారు? ఒపీనియన్ పోల్ జరుపుతారా? ప్లెబిసైట్ లేక రెఫరెం డం నిర్వహిస్తారా? ఇది ఏదైనా సాధ్యమేనా? నిజానికి ఇతర ప్రాంతా ల ప్రజల మనోభావాలు తెలుసుకొనే అవసరం ఇంకా ఉందా?
2004 ఎన్నికలలో సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికల బరి లోకి దిగిన తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజ లు కూడా తిరస్కరించలేదా? దీనితో ఇతర ప్రాంతాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకులు కారనే సంకేతాలు రాలేదా? ఇంకా ఎవరి అభిప్రాయం కావాలి? రాజ్యాధికారమే పరమావధిగా ఉన్న చంద్రబాబునాయుడు, రాజశేఖర రెడ్డి వంటి వారి అభిప్రాయమా? హైదరాబాద్ స్థానికుల జీవితాలను దుర్భరం చేసి న రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అభిప్రాయమా? పెట్టుబడులపేరుతో పెత్తనం చలా యించే ఆంధ్ర ప్రాంత సంపన్నవర్గాల అభిప్రాయమా?
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయినప్పుడు, తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్ర లో విలీనం చేసినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నారు? అంతెందుకు, భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినప్పుడు బ్రిటిష్ పాలకుల అభిప్రాయాలు అడిగినా మా? ఇప్పుడు కడుపునొప్పితో ఒకడు వైద్యుని వద్దకు పోతే ముందు పక్కింటి వానికి వైద్య పరీక్షలు చేస్తానన్న చందంగా ఉంది తెలుగుదేశం సరళి. టీడీపీకి 119 మంది శాసనసభ్యులు గల తెలంగాణ ప్రాంతం కన్నా 175 మంది శాసనసభ్యులు ఉన్న ఇతర ప్రాంతాలు ముఖ్యమని బాహాటంగానే అంటు న్నారు.
ఏ విధంగానైనా ఎక్కువ సీట్లు సంపాదించి, చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం తప్ప, వారికి వేరే అజెండా లేనట్టుంది. రాజ్యాధి కార రేసులో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంత సమస్యలు, ఇక్కడి ప్రజల వెత లు పట్టవు. తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యం లేకపోయిన తెలుగుదేశం పార్టీ అధికారా నికి రావడానికి తహతహలాడుతున్నది. ఇటువంటి పరిస్థితే ఏర్పడితే ప్రభుత్వం ఏ విధంగా నిలదొక్కుకొంటుందో వారికి తెలియాలి.
అసలు ఈ కోర్ కమిటీ ఏ నిర్ణయ మూ తీసుకోదట. ఏదో అధ్యయనం చేసి నివేదికను అ«ధ్యక్షునికి సమర్పిస్తుందట. కమిటీలో చర్చించే విషయాలు బయటికి పొక్కొద్దట. ఈ లోగా తెలంగాణ గురించి అనుకూలంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవట. కాని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం చేస్తారో చెప్పరు. కమిటీకి అసలు కాలపరిమితే లేదట. మరి కమిటీ పని పూర్తి చేయడానికి సరియైన సమయం ఎప్పుడు వస్తుందో? ఈ కమిటీ మరికొంత కాలయాపన చేసి చివరకు కర్ర విరగని, పాము చావని సూత్రీకర ణలు చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం ఉండదు. దానితో కథ మొదటికొస్తుంది.
ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకుల కర్తవ్యం ఏమిటో వారు నిర్ణయించుకోవాలి. వారిలో అనేకులు తెలంగాణ సమస్యల పట్ల అవగాహన, ప్రత్యేక రాష్ట్ర సాధన పట్ల నిబద్ధత కలవారు ఉన్నారు. వారి ప్రయత్నా లపై నీళ్లు చల్లే ఉద్దేశంతోనే కోర్ కమిటీ నియామకం జరిగింది. వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తలవంచి అగ్రనాయకులుగా ఎదుగుతారా లేక వలసవాద నాయకుల ఒత్తిళ్ళకు లొంగి, రెండవ శ్రేణి నాయకులుగా మనుగడ కొనసాగిస్తారా అనేది వారి ముందున్న ప్రశ్న. వారు ఏ నిర్ణయం తీసుకున్నా, తెలంగాణ ప్రజలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో రెండవ శ్రేణి పౌరులుగా బతకడానికి సిద్ధంగా లేరు.
Thursday, June 19, 2008
Subscribe to:
Posts (Atom)